Tuesday 10 May 2016

పైలట్‌ రహిత విమానాలు, క్షిపణులు ఎలా ప్రయాణిస్తాయి?

ప్రశ్న: పైలట్‌ రహిత విమానాలు, క్షిపణులు ఎలా ప్రయాణిస్తాయి?

జవాబు: భూగోళం మొత్తాన్ని ఊహాయుత రేఖలతో విభజించుకున్న సంగతి తెలిసిందే. అడ్డంగా ఉండే అక్షాంశాలు, నిలువుగా ఉండే రేఖాంశాలుగా ఏర్పాటు చేసుకున్న ఈ గీతల ఆధారంగా భూమ్మీద ఏ ప్రాంతాన్నయినా గుర్తించగలుగుతాం. అట్లాసును పరిశీలిస్తే మీకీ సంగతి అర్థమవుతుంది. విమానాల్లోను, రాకెట్లలోను అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లు ఉంటాయి. వాటి మెమొరీలో ముందుగానే వివిధ విమానాశ్రయాలు, చేరవలసిన లక్ష్యాలను ఈ ఊహాయుత రేఖలను ఆధారంగా గుర్తించి ఆ సమాచారాన్ని ఫీడ్‌ చేసి డేటాబేస్‌గా ఉంచుతారు. పైలట్‌ ఉండే విమానాల్లో సైతం ఆ విమానం ఏ దిశలో, ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ప్రయాణించాలో కంప్యూటర్లతో అనుసంధానమైన వ్యవస్థే చెబుతుంది. పైలట్‌ లేని విమానాలు, క్షిపణుల విషయంలో అవి ప్రయాణించాల్సిన మార్గం మొత్తాన్ని కంప్యూటర్లలో నమోదు చేస్తారు. ఆయా విమానాల గమనాన్ని కంప్యూటర్లు, భూమ్మీద ఉండే నియంత్రణ వ్యవస్థలే నియంత్రిస్తూ ఉంటాయి. ఇదంతా ఆధునిక సాంకేతిక విజ్ఞానం చేసే మాయాజాలం.

www.baskerdesh.in