Tuesday 24 May 2016

తల వెంట్రుకలు ఎలా రూపొందుతాయి?

ప్రశ్న:
తల వెంట్రుకలు ఎలా రూపొందుతాయి?

జవాబు:
పరిణామ క్రమంలో జంతువులు ఏర్పడ్డాక అవి పరిసరాలలోని ఉష్ణం, శీతలం, తేమ, సూక్ష్మజీవుల తాకిడి లాంటి పరిస్థితుల నుంచి రక్షణ పొందడానికి చర్మం మీద బొచ్చు ఏర్పడ్డం ప్రారంభమైంది. చర్మంలో ప్రధానంగా బయటి పొర (exodermis), లోపలి పొర (endodermis) అనే రెండు పొరలుంటాయని చదువుకుని ఉంటారు. చర్మం లోపలి పొర పలుచని కండరాలతో కూడి ఉంటుంది. ఇందులో పాదుల్లాంటి గుళికలు ఉంటాయి. వీటినే రోమస్థావరాలు (hair follicles) అంటారు. ఎలాగైతే వరి, జొన్నలాంటి మొక్కలు నేలపాదుల్లో గట్టిగా వేళ్లూనికుని పైకి ఎదుగుతాయో అలాగే ఈ కేశ స్థావరాల్లోంచి వెంట్రుకలు మొలిచి చర్మం బయటి పొర దాటి పైకి వస్తాయి. వెంట్రుకల్లో ఉండేది ఓ విధమైన ప్రొటీన్లు. వీటిని రసాయనికంగా ఆల్ఫా కెరోటీన్లు అంటారు. గంధకం కూడా ఓ అంశంగాగల సిస్టీన్‌ అనే ఆమైనో ఆమ్లం ప్రధానంగా ఉండే ప్రొటీన్లు ఇవి. ఈ ప్రొటీన్లతో పాటు మెలనిన్‌ అనే వర్ణ రేణువులు (pigments) విస్తారంగా ఉంటే ఆ వెంట్రుకలు నల్లగా ఉంటాయి. అవి లేనివి తెల్లగా ఉంటాయి.

www.bhaskerdesh.in

తల వెంట్రుకలు కొందరికి వంకర లేకుండా తిన్నగా ఉంటే, కొందరికి ఉంగరాలు తిరిగి ఉంటాయెందుకు?


ప్రశ్న: తల వెంట్రుకలు కొందరికి వంకర లేకుండా తిన్నగా ఉంటే, కొందరికి ఉంగరాలు తిరిగి ఉంటాయెందుకు?

జవాబు: తల వెంట్రుకల రంగులాగే వాటి ఆకారం కూడా జన్యు సంబంధమైన విషయమే. తూర్పు ఆసియా ప్రాంతం వారి తలవెంట్రుకలు సాధారణంగా వంకర లేకుండా తిన్నగా ఉంటే, యూరోపియన్లవి తిన్నగానైనా, ఉంగరాలుగానైనా ఉంటాయి. ఆఫ్రికా దేశవాసుల జుట్లు ఉంగరాలు తిరిగి బిరుసుగా ఉంటుంది. తిన్నగా ఉండే వెంట్రుకల అడ్డుకోత గుండ్రంగా ఉంటే, ఉంగరాల జుట్టు అడ్డకోత అండాకార రూపంలో ఉంటుంది. వివిధ రకాల వెంట్రుకలను వాటిలో ఉండే రసాయనిక సమ్మేళనాలను బట్టి గుర్తించవచ్చు. ప్రతి వెంట్రుకలో ప్రొటీన్‌ కెరొటిన్‌ అణువులు ముఖ్యంగా ఉంటాయి. తిన్నగా ఉండే వెంట్రుకల్లో ఇవి సల్ఫర్‌ బాండ్లలో గంధక బంధనాల (సల్ఫర్‌ బాండ్ల) ద్వారా ఒకటిగా బంధింపబడి ఉండడంతో అవి సాపుగా, దృఢంగా ఎదుగుతాయి. వీటికి తోడు అదనంగా వదులుగా బంధింపబడి స్థితిస్థాపకత కలిగిన కెరొటిన్‌ కలిగి ఉండే వెంట్రుకలు వంకర తిరిగి ఉంగరాల జుట్లుగా ఏర్పడతాయి. తిన్నగా ఉండే వెంట్రుకలలోని సల్ఫర్‌బాండ్లను విచ్ఛిన్నం చేయడం ద్వారా వాటిని ఉంగరాల జుట్టుగా మార్చవచ్చు. ఈ ప్రక్రియను పెర్మింగ్‌ అంటారు.

వృద్ధాప్యంలో తల వెంట్రుకలు తెల్లబడతాయెందుకు?.

ప్రశ్న: వృద్ధాప్యంలో తల వెంట్రుకలు తెల్లబడతాయెందుకు?.

జవాబు: వెంట్రుకలు దేహంపై ఉండేే చర్మంలో ఒక భాగం. చర్మం ఛాయ శరీరంలో ఉండే ఐదు పిగ్మెంట్ల (రంగుతో కూడిన పదార్థాలు)పై ఆధారపడి ఉంటుంది. ఈ పిగ్మెంట్లలో 'మెలానిన్‌' ముఖ్యమైనది. ఇది దేహంలో ఉండే మెలనోసైటిస్‌ అనే కణాల నుండి ఉత్పన్నమవుతుంది. ఈ మెలానిన్‌ చర్మం కింది భాగంలో, వెంట్రుకలలో, కళ్ళలో ఉంటుంది. మెలానిన్‌ తక్కువ పాళ్లలో ఉంటే శరీరం తెల్లగాను, ఎక్కువగా ఉంటే నల్లగాను ఉంటారు. కళ్లు, వెంట్రుకల రంగు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.

వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా వృద్ధాప్యంలో శరీర ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. మెలనోసైటిస్‌ కణాలు తక్కువ శాతంలో మెలానిన్‌ను ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వృద్ధులకు తల నెరుస్తుంది. నిజానికి ప్రతి వెంట్రుక పారదర్శకంగా ఉండే ఒక సన్నని గొట్టం లాంటిది. ఆ గొట్టం నిండా మెలానిన్‌ ఉన్నంత కాలం ఆ వెంట్రుక నల్లగా ఉంటుంది. దానికి తగినంత మెలానిన్‌ అందకపోతే వెంట్రుక నల్లని రంగు క్రమేపీ మారి గొట్టం మొత్తం ఖాళీ అయిపోగానే తెల్లగా కనిపిస్తుంది. బాల్‌పాయింట్‌ పెన్‌ రీఫిల్‌ నిండా ఇంకు ఉన్నప్పుడు నల్లగాను, ఇంకు పూర్తిగా అయిపోయిన తర్వాత తెల్లగాను కనబడినట్టే ఇది కూడానన్నమాట. ఒకోసారి మెలనోసైటిస్‌ కణాలు మెలానిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడంతో యుక్తవయసులోనే కొందరి తల వెంట్రుకలు తెల్లబడతాయి. దీన్నే బాలనెరుపు అంటారు.

గిటార్ ముందు భాగములో ఒక రంద్రం ఉంటుంది ,.. దాని అవసరము ఏమిటి?

గిటార్ ముందు భాగములో ఒక రంద్రం ఉంటుంది ,.. దాని అవసరము ఏమిటి?

గిటార్ లో తంత్రులు (Strings) ఒక పొడవైన బద్దలాంటి భాగము, దానికి అనుసంధానము గా బోలుగా ఉండే పట్టేలాంటి భాగాలపై బిగించి ఉంటాయని మనకు తెలుసు . గిటారును వాయించడం అంటే బిగించి తన్యతతో (Tensoin) తో కూడిన లోహపు తీగెలను మీటడమే ... అలా మీటినపుడు ఏర్పడిన ధ్వని తరంగాలు గిటారు నుంచి బయటకు వస్తేనే ఆ శబ్దాన్ని శ్రోతలు వినగాలుగుతారు . aలా శబ్ద తరంగాలు బయటకు రావడానికే పెట్టేలాంటి భాగము లో రంద్రాన్ని ఏర్పరుస్తారు . పెట్టె బోలుగా ఉండడము వల్ల దాని లో ఉండే గాలి తీగల్లో ఉత్పన్నమయ్యే శబ్దతరంగాల కంపనాలతో పాటు బలాత్క్రుత తరంగ కంపనాలను (ForcedVibrations) ఉత్పన్నము చేస్తాయి. ఇందువల్ల గిటార్ నుంచి వలువదే ధ్వని గంభీరము గా , శ్రావ్యము గా ఉంటుంది .

అందుకనే వీణ , వయోలిన్ , గిటార్, తంబురా .. లాంటి వాయిద్యాలలో కుడా తీగలను బోలుగా రంద్రాలన్దే పెట్టెల(SoundBoxes) పై బిగిస్తారు.

www.bhaskerdesh.in

తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా?

ప్రశ్న: తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా?

జవాబు: ఈ అభిప్రాయంలో నిజం లేదనే చెప్పుకోవాలి. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్‌ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం (epidermis) కింద ఉన్న అంతశ్చర్మం (dermis)లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న సంభావ్యత తక్కువ.

www.bhaskerdesh.in

భూగర్భ జలాలు అంటే ఏమిటి?


ప్రశ్న: భూగర్భ జలాలు అంటే ఏమిటి?

జవాబు: సముద్రపు తీరానో లేక ఒక సరస్సు పక్కన ఉన్న ఇసుకను చేతితో తోడుతూ పోతే కొంతలోతులో నీరు లభిస్తుంది. ఆ నీరే భూగర్భ జలం. నేలపై బావి తవ్వితే అందులో ఊరే నీరు భూగర్భ జలం. భూమిపై కురిసిన వర్షపునీరు, మంచు, వడగళ్లవాన వల్ల ఏర్పడిన నీరు గురత్వాకర్షణ వల్ల నేలపై ఉండే మన్ను, ఇసుక, గులకరాళ్ల పొరలగుండా భూమిలోకి ప్రవేశించి అక్కడ ఉండే రాతి పొరల్లో పయనించి కొంత లోతులో నిక్షిప్తమవుతుంది. సరస్సులలో నదుల్లో, సముద్రాల్లో లభించే నీరు ఉపరితలపు నీరు (surface water). ఉపరితలపు నీరు, భూగర్భ జలాలు వాటి స్థలాలను మార్చుకుంటాయి. భూగర్భ జలాలు భూమిలోని పొరల గుండా సరస్సుల్లోకి, కాలువల్లోకి ప్రవేశింవచ్చు. అలాగే సరస్సుల్లోని నీరు పక్కనే ఉన్న భూభాగంలోకి 'లీకై' భూగర్భ జలంగా మారవచ్చు.

భూగర్భ జలాలను తనలో ఇముడ్చుకొనే ప్రక్రియలో భూమి ఒక పెద్ద స్పాంజిలాంటి పాత్రను పోషిస్తుంది. భూగర్భ జలాన్ని బావులు తవ్వడం ద్వారా, బోరు పంపులు వెయ్యడం ద్వారా భూమిపైకి తీసుకొని వచ్చి, ఆ నీటిని తాగునీటిగా, సేద్యపు నీరుగా వాడుకుంటాం. ఆ విధంగా భూగర్భజలం మానవులకు ప్రకృతి ప్రసాదించిన ఒక బ్యాంక్‌ ఎకౌంట్‌ లాంటిది.

భూగర్భజలాలు చాలావరకు స్వచ్ఛంగానే ఉంటాయి. ఎటొచ్చి భూమి లోపల నిర్మించిన ఆయిల్‌ టాంకర్లు లీక్‌ అయితేనే, పంటపొలాలకు అవసరానికి మించి రసాయనిక ఎరువులు వేయడం వల్లో ఆ కాలుష్యాలు భూగర్భ జలాలను కలుషితం చేసే ప్రమాదం ఉంది.

www.bhaskerdesh.in

Monday 23 May 2016

చిన్న వయసులోనూ కొంతమందికి తెల్ల జుత్తు వస్తుంది ఎందువల్ల?


 ప్రశ్న:చిన్న వయసులోనూ కొంతమందికి తెల్ల జుత్తు వస్తుంది ఎందువల్ల?

జవాబు: మన తలపై ఉండే వెంట్రుకలు ఏక కాలంలో రెండు రకాలుగా ఉపయోగపడతాయి. పరిసరాల్లో ఉన్న ఉష్ణాన్ని బాగా గ్రహించి శరీరంలోకి చేరకుండా చేసే మంచి ఉష్ణ గ్రాహణి (heat absorber)గాను, శరీరంలో విడుదలయిన వేడి త్వరితంగా వాతావరణంలోకి పంపగల మంచి ఉష్ణ ఉద్గారిణి (heat emitter) గాను అవి పనిచేస్తాయి. మరి ఆ వెంట్రుకలకు నల్లని రంగు ఎలా వచ్చింది? చర్మం పైపొర కిందున్న డెర్మిస్‌ అనే పొరలో కేశ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు తెల్లగా నైలాన్‌ దారంలా ఉండే ప్రోటీను తీగల్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ ప్రోటీను తీగల తయారీ సమయంలోనే కేశ గ్రంథులకు దగ్గరే ఉన్న కణాల్లోని మెలనిన్‌ అనే నల్లని వర్ణ రేణువులు ఆ ప్రోటీను అణువుతో లంకె వేసుకుంటూ వెంట్రుకతో పాటు బయట పడతాయి. అందువల్లనే తెల్లగా ఉండవలసిన వెంట్రుక ప్రోటీను తీగ నల్లగా కనిపిస్తుంది.

ఈ మెలనిన్‌ రేణువులకు సాధారణ కాంతినే కాకుండా అరుదుగానైనా సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల్ని కూడా శోషించుకునే లక్షణం ఉంది. వెంట్రుకల ఉత్పత్తి ఆగకున్నా మెలనిన్‌ రేణువులు సరిగా ఉత్పత్తి కాకుంటే వయసు చిన్నదయినా తెల్లని వెంట్రుకలే తలపై ఉంటాయి. వృద్ధాప్యంలో ఈ మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి తక్కువ అవుతుంది కాబట్టి ముసలి వారి వెంట్రుకలు తెల్లబడతాయి. సౌర కాంతి అధికంగా లేని పశ్చిమోత్తర (northwest) ప్రజల వెంట్రుకలు కూడా తెల్లగా ఉంటాయి.

www.bhaskerdesh.in

రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు?

ప్రశ్న: రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు?

జవాబు: కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్‌(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని మకరందాన్ని పీల్చుకుని జీవిస్తాయి. ఇవి పూలపై వాలినపుడు వాటి కాళ్లకు, రెక్కలకు పూలలోని పుప్పొడి అంటుకుంటుంది.

ఈ కీటకాలు మరో పువ్వుపై వాలినపుడు పుప్పొడి రేణువులు ఆ పూవు అండాశయాన్ని చేరి ఫలదీకరణం జరుగుతుంది. అపుడే పువ్వు కాయగా మారుతుంది. అవే పండ్లుగా మారి వాటి గింజలు భూమిపై పడి మొలకెత్తి మొక్కలు పెరుగుతాయి. ఈ విధంగా మొక్కలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడే కీటకాలను ఆకర్షించేందుకే పూలకు అందమైన రంగులు, రకరకాల సువాసనలు ఏర్పడతాయి.

కీటకాల్లో కొన్ని పగలు సంచరిస్తే మరికొన్ని రాత్రివేళల్లో తిరుగుతుంటాయి. పగటి వేళ వీటిని ఆకర్షించడానికి వాటి రంగులు దోహదపడతాయి. రాత్రివేళ రంగులు కనబడవు కాబట్టి రాత్రి పూచేపూలు మరింత ఎక్కువగా సువాసనను వెదజల్లుతాయి.

సాయం వేళల్లో, రాత్రులలోని వాతావరణ పరిస్థితులకు మాత్రమే ప్రేరణ పొంది వికసించే జాజి, మల్లె, నైట్‌క్వీన్‌ లాంటి పూలకు మనోహరమైన సువాసన ఉండటానికి కారణం అదే. రాత్రిపూట రంగులతో పని ఉండదు కాబట్టి సాధారణంగా అలాంటి పూలు చీకటిలో కనిపించేందుకు వీలుగా తెల్లని రంగులో ఉంటాయి.

www.bhaskerdesh.in

జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. కానీ బంగారం, ప్లాటినం వంటి లోహాలు పట్టవు. ఎందుకు?

ప్రశ్న: జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. కానీ బంగారం, ప్లాటినం వంటి లోహాలు పట్టవు. ఎందుకు?

జవాబు: సూర్యుడి లాంటి నక్షత్రాల్లో కేవలం వాయువులే ఉన్నా భూమిలాంటి గ్రహాల్లో వాయువులతోపాటు ద్రవాలు, ఘనపదార్థాలు ఉన్నాయి. వీటి అంతర నిర్మాణాన్ని బట్టి మూలకాలు, లేదా సంయోగ పదార్థాలు అనే రెండు కోవలకు చెందుతాయి. మూలకాల్లో ఒకే రకమైన పరమాణువులు ఉంటాయి. ఉదాహరణకు అల్యూమినియం లోహంలో ఉన్నవన్నీ అల్యూమినియం పదార్థంతో కూడిన పరమాణువులే. కానీ సంయోగ పదార్థాలు, కొన్ని మూలకాలు కలవడం వల్ల ఏర్పడతాయి. వీటిలో వేర్వేరు రకాలైన పరమాణువులు బృందాలుగా ఉంటాయి. ఈ బృందాలను అణువులు అంటాం.

సాధారణంగా మూలకాల కన్నా సంయోగ పదార్థాలు స్థిరంగా ఉంటాయి. స్థిరంగా ఉండడమంటే రసాయనికంగా మార్పును నిరోధించడమే. ఉష్ణగతిక శాస్త్రం ప్రకారం పదార్థాలు మారడానికి కారణం వాటిలో ఉన్న అంతరంగిక శక్తి తగ్గడమే. ఇనుము, జింకు, రాగి, అల్యూమినియం, మెగ్నీషియం వంటి లోహాల మూలకాలకన్నా వాటి సంయోగ పదార్థాలైన లోహ ఆక్సైడ్‌లు తక్కువ శక్తితో ఉంటాయి. కాబట్టి ఆ లోహాలు తుప్పుపట్టడాన్ని ఆమోదిస్తాయి. కానీ బంగారం, ప్లాటినం, స్టెయిన్‌లెస్‌ స్టీలు వంటి లోహాల మూలకాలకన్నా వాటి సంయోగ పదార్థాలైన లోహ ఆక్సైడ్‌లు ఎక్కువ శక్తితో ఉంటాయి. కాబట్టి అవి తుప్పు పట్టవు.

www.bhaskerdesh.in

Friday 20 May 2016

కాంతి (LightRay) - తరంగమ?కణమా ?


కాంతి (LightRay) - తరంగమ?కణమా ? అంటే చెప్పడము కష్టమే ! ఒక్కొక్క సారి ప్రశ్న కు ఎదురు ప్రశ్నే జవాబునిస్తుంది . ఉదాహరణకి నానేనికున్నది బొమ్మా లేదా బొరుసా? అంటే ఏం చెబుతాం ?. కాంతికి కుడా నాణేనికిలాగే కణ(Corpuscular) స్వభావము , తరంగ (Wave)స్వభావము సంయుక్తం గా అవిభాజ్యం గా ఉంటాయి . ఎలాగైతే నేల మీద పడేసిన నాణెపు రెండు పక్కలు (బొమ్మ , బొరుసు) ఒకే సారి ఎలా చూడ లేమో ... ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్ని , కణ స్వభావాన్ని ఏకకాలం లో పరిశీలించాలేము .

కాంతి వక్రీభవనం(Refraction) , వివర్తనం (Disfraction) , వ్యతికరణం (Interference), ద్రువనం (Polarisation) అనే ధర్మాలను కలిగి ఉంటుంది . కాంతి కున్న తరంగ స్వభావానికి ఈ ద్రుగ్విషయాలు కారణము . కాంతి విద్యుత్ఫలితము (PhotoElectricEffect), కాంఫ్తాన్ ఫలితము , కాంతి రసాయనిక చర్యలు (PhotoChemical phinomena) , కృష్ణ వస్తు వికిరణం (BlackBodyRadiation) ఉద్గార వర్ణ పటాలు (EmissionSpectra) వంటి ప్రయోగ ఫలితాలు , పరిశీలనలు , కాంతి కున్న కనస్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకం గా రెండు లక్షణాలు ఏక సమయం లో ఉండడం వల్ల కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం (WaveParticleDuality) ఉందంటారు.
www.bhaskerdesh.in

విద్యుత్‌ పరికరాల వాడకంలో రెండు వైర్లు బదులు ఒకటే వినియోగించి విద్యుత్‌ ప్రసారం చేయలేరా?


ప్రశ్న: విద్యుత్‌ పరికరాల వాడకంలో రెండు వైర్లు బదులు ఒకటే వినియోగించి విద్యుత్‌ ప్రసారం చేయలేరా?
జవాబు: ఏదైనా విద్యుత్‌ పరికరం పని చేయాలంటే అందులో కీలకమైన విద్యుత్‌ వలయం (electrical circuit)లో విద్యుత్‌ ప్రవాహం జరగాలి. నదిలో నీరు ప్రవహించినట్టే ఆ విద్యుత్‌ వలయంలో ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి. నదికి నీరు వచ్చే దిశ, వెళ్లే దిశ ఉన్నట్టే విద్యుత్‌ పరికరానికి ఎలక్ట్రాన్లు చేరే చివర (terminal), ఎలక్ట్రాన్లు పోయే చివర అంటూ రెండు ధ్రువాలు ఉండాలి. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఒక ధ్రువాన్ని భూమికి కలిపి రెండో ధ్రువాన్ని విద్యుద్వాహినిగా చేస్తారు. భూమికి కలిపిన చివరను న్యూట్రల్‌గాను, విద్యుత్‌ ప్రవహించే తీగను ఫేజ్‌ లేదా లైన్‌ అనే పేరుతోను వ్యవహరిస్తారు. అవే రెండు తీగలు. ప్రతి సారీ మనం ఇళ్లలో గొయ్యి తవ్వి భూమికి ఒక వైరును తగిలించలేము కాబట్టి ఇళ్లకు వచ్చే సరఫరాలోనే భూమిని కలిపే సదుపాయమే న్యూట్రల్‌. ఇక బ్యాటరీల విషయానికి వస్తే విధిగా రెండు తీగలను (ధన, రుణ ధ్రువాలు) ఉండాలి. ఇక్కడ ఒక తీగ పనిచేయదు. ఎందుకంటే బ్యాటరీలోనే విద్యుత్‌ ప్రవాహం ఆరంభమవుతుంది కాబట్టి తిరిగి ఎలక్ట్రాన్లు అక్కడికే చేరాలి. లేకపోతే వలయం తెగిపోతుంది.
www.bhaskerdesh.in

Monday 16 May 2016

మనం రకరకాల ఆహారపదార్థాలు తీసుకుంటాము. ఎన్నో రుచికరమైన, సువాసన భరితమైన మసాలా దినుసులతో ఆహారాన్ని, పానీయాల్ని సేవిస్తాము. కానీ జీర్ణమయ్యాక మిగిలిన వ్యర్థాలు (మలమూత్రాలు) దుర్గంధంగా ఉండడానికి కారణమేమిటి? 


Q : మనం రకరకాల ఆహారపదార్థాలు తీసుకుంటాము. ఎన్నో రుచికరమైన, సువాసన భరితమైన మసాలా దినుసులతో ఆహారాన్ని, పానీయాల్ని సేవిస్తాము. కానీ జీర్ణమయ్యాక మిగిలిన వ్యర్థాలు (మలమూత్రాలు) దుర్గంధంగా ఉండడానికి కారణమేమిటి? 

A : తీసుకున్న ఆహారపదార్థాలలోని పిండిపదార్థాల్లోంచి గ్లూకోజు, ఫ్రక్టోజులు, మాంసకృత్తుల నుంచి వివిధ అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాల నుంచి కణత్వచాని (cell wall) కి ఉపయోగపడే లిపిడ్లు ఉత్పన్నమవుతాయి . అవి చిన్నప్రేవులో ఉండే విల్లై అనే కణపొర ద్వారా రక్తంలో కలుస్తాయి . ఇంతవరకు బాగానే ఉంది. అయితే నోటి నుంచి గుదము (anus) వరకు వ్యాపించిన దాదాపు 2, 3 మీటర్ల పొడవుండే జీర్ణకోశ వ్యవస్థలో పలుచోట్ల పలురకాలైన భౌతిక రసాయనిక స్థితులు ఉంటాయి. అనువైన చోట్ల మన పుట్టుక వెంటనే ఎన్నో బాక్టీరియాలు మన జీర్ణవ్యవస్థలో తమ స్థావరాల (colonies) ను ఏర్పరుచుకొంటాయి. ఇందులో అపాయకరమైన బాక్టీరియాలు, ఉపయోగపడే బాక్టీరియాలు రెండూ ఉంటాయి. మనకు నోటిలో పుండ్లు రావడం, విరేచనాలు రావడం, వాంతులు రావడం, అజీర్తి వంటి పలు అవాంఛనీయమైన లక్షణాలకు కారణం ప్రమాదకర బాక్టీరియాలు మన జీర్ణవ్యవస్థలో ఉండడమే. ఇచరేరియాకోలై (E.Coli), సాల్మొనెల్లా, జియార్డియా (giordia), క్రిప్టోస్పోరిడియం (cryptosporidum) వంటివి ప్రేగుల్లో ఉంటాయి. ఉపయోగపడే బాక్టీరియాను ప్రొబయోటిక్స్‌(probiotics) అంటారు. ఇందులో లాక్టోబాసిల్లస్‌ అసిడోఫిలస్‌ (Lactobacillus acidophilus), బైఫిడోబాక్టీరియా బైఫ్రిడమ్‌ (Bifidobacteria bifridum) వంటివి ఉదాహరణలు. 

మంచి బాక్టీరియా అయినా చెడు బాక్టీరియా అయినా అవీ బతకాలి. తమ సంతానాన్ని పుంఖాను పుంఖాలుగా పెంచుకోవాలి. కాబట్టి వాటికీ ఆహారం అవసరం. కొన్ని బాక్టీరియాలు వాటి సంఖ్య మించితే మనకు వాంతులు, విరేచనాలు, కలరా, డయేరియా లాంటి వ్యాధులతో తెలిసిపోయినా వాటి సంఖ్య అదుపులో ఉన్నంతవరకు వాటిని మన తెల్లరక్తకణాలు నాశనం చేస్తుంటాయి. కాబట్టి బాక్టీరియాలు మన కణాల్ని తింటూ వాటి విసర్జక పదార్థాల్ని జీర్ణమవుతున్న మన ఆహారపదార్థాల మిశ్రమంలోనే కలుపుతాయి. అందులో చాలా దుర్గంధభరితమైన గంధకం, ఫాస్ఫరస్‌, నత్రజని సమ్మేళనాలు ఉంటాయి. 

చాలాసార్లు మన ఆహారాన్నే అవీ భాగం పంచుకొని మనలాగా కాకుండా మరో విధమైన అవాయు ప్రక్రియ (anaerobic metabolism) ద్వారా ఆక్సిజన్‌ అవసరం లేకుండానే శక్తిని పొంది తమ జీవన కార్యకలాపాల్ని కొనసాగిస్తాయి. అవాయు ప్రక్రియల్లో ఎన్నో దుర్గంధభరితమైన పదార్థాలు విడుదలవుతాయి. ఉపయోగపడే బాక్టీరియాలు కూడా పెద్దప్రేవుల్లో ఉంటాయి. ఇవి మన జీర్ణవ్యవస్థలో జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదార్థాల మీద ఆధారపడి బతుకుతుంటాయి.అవి ఒక్కోసారి దుర్గంధాన్ని తగ్గిస్తాయి. మరోసారి దుర్గంధాన్ని పెంచుతాయి. ఈ విధంగా మనం తీసుకున్న పంచభక్ష్య పరమాన్నాలు, సుగంధభరిత పానీయాలు, షడ్రుచుల ఆహారదినుసులు నోటి వరకే వాటి సౌభాగ్యం. ఆ తర్వాత అవి రకరకాల రసాయనిక ప్రక్రియల్లో, జీవ రసాయనిక ప్రక్రియల్లో, బాక్టీరియా కౌగిళ్లలో ... లోగిళ్లలో పడిపోయి వివిధ మార్పులకు లోనవుతాయి. చివరకు దుర్గంధ భరితమైన మలమూత్రాదుల రూపంలో బయటపడతాయి. ఇందులో ఉపయోగపడే బాక్టీరియాల వంతూ ఉంది కాబట్టి ఆ కంపే ఆరోగ్యానికి ఇంపు అనుకోకతప్పదు.
www.bhaskerdesh.in

ఎగిరే పాముల రహస్యమేమిటి ?


Flying Snakes Secreat what?, ఎగిరే పాముల రహస్యమేమిటి ?

పాములు పాకుతాయని తెలుసు... కానీ ఎగురుతాయా? అలాంటివి ఉన్నాయి! వాటిపై పరిశోధన జరిగింది... రహస్యమేంటో బయటపడింది!!

మీకు గ్త్లెడింగ్‌ అంటే తెలుసుగా? పెద్ద పెద్ద రెక్కల్లాంటి అమరిక ఉండే గ్త్లెడర్‌ని తీసుకుని ఏ కొండ మీదకో వెళ్లి దాంతో సహా దూకేసి చాలా దూరం ఎగురుతూ వెళ్లే సాహసక్రీడ అది. అచ్చం అలాగే గాలిలో ఎగిరే పాములు ఉన్నాయని మీకు తెలుసా? వాటినే ఫ్లయింగ్‌ స్నేక్స్‌ అంటారు. వీటిలో అయిదు జాతులు ఉన్నాయి. దక్షిణాసియా ప్రాంతాల్లోని అడవుల్లో కనిపించే ఇవి ఎలా ఎగరగలుగుతున్నాయనేది ఇంతవరకూ ఓ వింతే. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, వాటి రహస్యమేంటో కనిపెట్టారు.

గ్త్లెడింగ్‌ చేసే క్రీడాకారుల్లాగే ఎగిరే పాములు కూడా ఎత్తయిన ఏ చెట్టు మీదకో ఎక్కి, అక్కడి నుంచి చటుక్కున దూకేసి గాలిలో బ్యాలన్స్‌ చేసుకుంటూ కిందికి సురక్షితంగా చేరుకోగలవు. వేటాడ్డానికి, శత్రువు నుంచి తప్పించుకోడానికి ఇలా చేస్తాయి. ఇవి ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకేసి దాదాపు 100 మీటర్ల దూరాన్ని కూడా గాలిలో ప్రయాణించగలవు. ఇంత ఎత్తు నుంచి మామూలు పాముని పడేస్తే అది తలకిందులుగా కింద పడి ఎముకలు విరిగిపోవడం ఖాయం. మరైతే ఇది ఎలా ఎగరగలుగుతోంది? గాలిలోకి దూకగానే ఇవి తమ పక్కటెముకలు సాగదీసి గుండ్రని శరీరాన్ని సమతలంగా చేయగలుగుతాయని ఇంతకు ముందే తెలుసు. అయితే మరి కొన్ని పాములకు కూడా ఇలా శరీరాన్ని మార్చుకునే విద్య తెలుసు. అంటే ఎగిరే పాములు దీంతో పాటు మరో రకమైన విన్యాసం కూడా చేస్తున్నాయన్నమాట. మరి అదేంటి? అది తెలుసుకోడానికే శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.

అయిదు పాముల్ని తీసుకుని వాటిపై తెల్లటి మెరిసే చుక్కల్ని అమర్చారు. ఆపై వాటిని ఎత్తయిన టవర్‌పై వదిలి అవి అక్కడి నుంచి దూకి కిందకి రావడాన్ని ఒకేసారి నాలుగు కోణాల్లో అత్యాధునిక త్రీడీ వీడియో కెమేరాలతో చిత్రీకరించారు. ఆ దృశ్యాలను కంప్యూటర్‌లోకి ఎక్కించి, మెరిసే చుక్కల్ని బట్టి యానిమేషన్‌ మోడల్‌ పాములను సృష్టించి వాటి శరీరం ఎలాటి కదలికలకు లోనైందో గమనించారు.

ఇంతకీ ఏం తెలుసుకున్నారు? ఈ పాములు ఎత్తు నుంచి దూకుతూనే గాలి వీచే దిశని అంచనా వేస్తూ శరీరాన్ని 25 డిగ్రీల కోణంలో తిప్పడం ద్వారా బ్యాలన్స్‌ చేసుకుంటున్నాయని గమనించారు. గాలిపటాలు, విమానాలు ఎగరడంలో కింద నుంచి పైకి వీచే గాలి శక్తి ప్రధాన పాత్ర వహిస్తుంది. దీన్నే 'లిఫ్ట్‌' అంటారు. ఈ పాములు కూడా ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాయని తేలింది. తలని, తోకను వ్యతిరేక దిశల్లో చకచకా కదిలిస్తూ గాలిలోనే ఈదుతున్నట్టుగా ఎగురుతూ మార్గాన్ని కూడా మార్చుకుంటున్నాయని తేల్చారు.

www.bhaskerdesh.in

విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమ్మీద ఉన్న మనము, ఇతర జీవులు ఎందుకు తిరగరు?


ప్రశ్న: విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమ్మీద ఉన్న మనము, ఇతర జీవులు ఎందుకు తిరగరు?

జవాబు: భూమి ఆత్మప్రదక్షిణం చేస్తూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నమాట నిజమే. ఆ భూమితో పాటు ఇతర జీవులు మనం కూడా తిరుగుతూనే ఉన్నాయి. మనం ఏదైనా బస్సులాంటి వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు కదులుతున్న భావన మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ సమయాల్లో వాహనం మీద ప్రోద్బలమో (forwarding force), లేదా వ్యతిరేక బలమో (force of resistance), భూమ్యాకర్షణకు వ్యతిరేకంగానో, అనుకూలంగానో కొన్ని బలాలు పనిచేస్తూ ఉంటాయి. ఏ బలమూ పనిచేయని వాహనంలో సమవేగంతో మనం ప్రయాణిస్తుంటే మనకు ఎలాంటి కుదుపులు తెలియవు. భూమి మీద అపలంబ బలము, అపకేంద్ర బలము, సూర్యుడు గ్రహాల వల్ల కలిగే గురుత్వబలము కలగలిపి పనిచేసినా వాటి నికర బలం(effective force) శూన్యం. అందువల్ల భూమి భ్రమణ, పరిభ్రమణాల ప్రభావం మన మీద పడదు. అందువల్ల మనం కదలనట్టే భావిస్తాము.
www.bhaskerdesh.in